- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. స్థానిక ఎన్నికలపై హై కోర్టు స్టే ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వద్ద, పార్లమెంట్ లో అడ్డుకున్నది బిజెపి అయితే కోర్టులో కేసు వేసి అడ్డుకున్నది బిఆర్ఎస్ అని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం తరపున మేం బలమైన వాదనాలు వినిపించామని, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇలా మధ్యంతర స్టే విధిస్తుందని అనుకోలేదని అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని అన్నారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. బీసీ 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల సర్వేలు నిర్వహించి, కృత నిశ్చయంతో వన్ మెన్ కమిషన్ వేసిందని తెలిపారు. కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ కు పంపించామని తెలిపారు. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశామన్నారు. తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధంగా ఇక్కడ కూడా చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రాక గ్రామాలు అభివృద్ధి చేయలేకపోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టు ఉందని, జీవో 9 ముందుకు వెళుతుంటే కోర్టులో అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరపున కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తుంటే, బీఆర్ ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. వీరి నాటకాన్ని ప్రజల ముందు ఉంచుతామని, బిజెపి, బిఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలకు చెప్తామని తెలిపారు. 42 శాతంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. కోర్టులో ఇంకా గట్టిగా వాదన వినిపించి 42 శాతానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

