. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
హిందూ సంప్రదాయం–సంస్కృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టలో ఉన్న ఎల్లమ్మ దేవి ఆలయములో మంగళవారం నిర్వహించిన ఏకాదశ వార్షికోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంగళవారం ఆలయంలో బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం నుండి బోనాలు తీశారు. ఈ బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనం ఎత్తుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అనంతరం ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలు, పంచయాగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలను ఐక్యపరుస్తాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల ఎల్లమ్మ దేవికి ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉందని, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా భక్తుల కొంగు బంగారంగా ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ఎల్లమ్మ దేవి ఆశీస్సులతో జిల్లా, ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. నగరంలో ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. ఎల్లమ్మ దేవి ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా మారిందని, ఇటువంటి వార్షికోత్సవాలు యువతకు సంస్కృతి విలువలను తెలియజేస్తాయని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, నగర అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి మోహన్, ప్రధాన కార్యదర్శి ఉల్లేంగ నాగరాజు, బొబ్బిలి వేణు, న్యాలం రాజు, దంతుల రవి, ఉపాధ్యక్షులు పంచరెడ్డి సంతోష్, ఉప కార్యదర్శి నైయినోళ్ళ వేంకటేశం, యెండల లక్ష్మణ్, పంచరెడ్డి సాయిలు, బొబ్బిలి మనోహర్ తో పాటు మున్నూరు కాపు సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఎల్లమ్మ గుట్ట, బొబ్బిలి వీధి పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు హృదయపూర్వక స్వాగతం పలికారు.
