నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డా. కవితా రెడ్డి గురువారం నిజామాబాద్ నగరంలోని నాగారం బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న వైద్య సేవలు, వైద్యులు మరియు సిబ్బంది హాజరు, రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల లభ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులను ఆమె పరిశీలించారు. తనిఖీ సందర్భంగా డా. కవితా రెడ్డి ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వైద్య సేవల నాణ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను సేకరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. రాజశ్రీతో కలిసి దవాఖానలో అందుతున్న సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని డా. కవితా రెడ్డి అధికారులను ఆదేశించారు.
