. . . అదనపు డీసీపీ జి. బస్వారెడ్డి
. . . పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల నిర్వహణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య మనస్తత్వం గల నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టనష్టాల్లో భాగస్వామ్యులై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారని అదనపు డీసీపీ జి.బస్వారెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు డీసీపీ(అడ్మిన్) జి. బస్వారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్గా పనిచేసిన సమయంలో ఆయన నిజాయితీ, నిరాడంబరత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ లు శంకర్, బషీర్, శ్రీనివాస్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పి.సి.ఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, సి.ఎస్.బి సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది, సిసిఆర్బి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
