కామారెడ్డి, బతుకమ్మ :
జాతీయ సమైక్యత, మత సామరస్యం, దేశ సమగ్రత సందేశంతో కొనసాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్రకు కామారెడ్డి పట్టణంలో ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు. మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ దేశ నిర్మాణానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జాతీయ ఐక్యత, మత సామరస్యం, దేశ సమగ్రతను బలోపేతం చేయడం యాత్ర ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 9న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగి ఆగస్టు 20న న్యూఢిల్లీలో ముగియనుంది. కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

