ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రం లో బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ యువకులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి, ఉపసర్పంచ్ ఫోరమ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, బీసీ–ఎస్సీ–ఎస్టీ మండల జాక్ అధ్యక్షుడు జూంగల గణేష్, రెండ్ల రాజారెడ్డి, మాజీ అధ్యక్షుడు జూంగల పెద్ద గంగారాం (బిగ్బాస్) మాట్లాడుతూ.. పండుగ సాయన్న ముదిరాజ్ నాటి తెలంగాణలో దొరలు, పెత్తందారులు, భూస్వాములు, దేశ్ముఖ్ల దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. దోపిడీకి గురైన సంపదను స్వాధీనం చేసుకుని, అన్యాయానికి గురైన పేద ప్రజలకు పంచిపెట్టి వారి సంక్షేమం కోసం పండుగ సాయన్న పోరాడారని వారు తెలిపారు. ఆయన చేసిన సేవలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బహుజన బిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ జీవిత చరిత్రను తెలుసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరపట్నం చిన్న గంగారాం, శ్రీనివాస్, రొక్కేడ సంజీవ్, కూరాకుల రమేష్, శ్రీనివాస్ గౌడ్, బాలు, గుర్రం చిరంజీవి, మచ్చ ప్రవీణ్, రామ్, లక్ష్మణ్, బుర్కాల ప్రభాకర్, మేహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
