- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇందూరు నగరంలోని ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘం ప్రాంగణంలో కలం స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ, “స్నేహం అనేది మానవ జీవితంలో అత్యంత విలువైన సంబంధం అన్నారు. కలం ద్వారా స్నేహం పెంచుకుంటూ, భావాల పరస్పర మార్పిడికి వేదిక కల్పిస్తున్న కలం స్నేహం అసోసియేషన్ వంటి సంస్థలు ప్రశంసనీయం” అన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో కవులు కళాకారులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కళలు మానవ వికాసానికి తోడ్పడుతాయి అన్నారు. కలల పట్ల ఇంత మంది మహిళలు ఆసక్తి కనపరచడం అద్భుతంగా ఉందని మహిళా సాధికారాతలో భాగంగా ఎందరో కవులను తీర్చి దిద్దుతున్న జాతీయ కలం స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారిని, ఉపాధ్యక్షులు హరిప్రియ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, సాహితీవేత్తలు తమ కవిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, యువ కళాకారులు నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి పలువురు సాహితీ, సంగీత ప్రియులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

