మోపాల్, బతుకమ్మ :
దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదని, ప్రభుత్వం కొనుగోలులొ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మోపాల్ మండల కేంద్రంలో శనివారం దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోఖో నిర్వహించారు. అనంతరం రోడ్డు మీదనే మానవహారం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, మోపాల్ గ్రామ సర్పంచ్ ధ్యాప రవి, అగ్గు చిన్నయ్యలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనడంలో విఫలం అవుతుందన్నారు. పంట వేసినప్పుడు యూరియా కొరతతో రైతుల్ని ఆగం చేసిన ఈ సర్కార్ చేతికి వచ్చిన పంటను కొనడంలో హరిగోస పెడుతున్నారన్నారు. 46 డిగ్రీల ఎండలో ఎన్ని రోజులు రైతులు తమ కుప్పల దగ్గర కాపలా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ల ద్వారా మేము కొనలేక పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కార్ కు చేతకాక పంటలు కొంటలేదని కేంద్ర ప్రభుత్వం అంటుందని ఒకరి మీద ఒకరు విమర్శలకే పరిమితం అవుతున్నారని వారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీడ సౌకర్యం, టెంట్ వేయడం, నీళ్ల సౌకర్యం పెట్టలేకపోతున్నారని రైతులు తీవ్ర ఎండవేడికి అస్వస్థకు గురవుతున్నారని అన్నారు.కొనుగోలు కేంద్రాలలో ఫీల్డ్ లో రైతు ముందు తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించి 24 గంటలలో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2 నుంచి 5 కిలోల తరుగు తాలూ పేరునా కట్ చేస్తూ రైస్ మిల్లుయాజమాన్యం, కొనుగోలు సంస్థల అధికారులు మిలాఖత్ అయి రైతును నిలువు దోపిడీ చేస్తున్నారని వారన్నారు. హమాలీలు, గన్ని సంచులు, లారీల కొరతల వల్ల తదితర కారణాలతో కొనుగోలు తీవ్ర జాప్యం జరుగుతుందని వీటన్నింటికీ చక్క పెట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగానే కొనుగోలులో జాప్యం కొనసాగినట్లయితే త్వరలోనే పెద్ద ఎత్తున రైతులంతా కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లొ గుడ్డోల్ల గంగాధర్, కెంపు నరేష్,పోతన్న, యెల్లోళ్ల నారాయణ,బంటు గంగాధర్, జక్కునడపన్న,మమ్మాయి మల్లవ్వ, కెంపు నర్సవ్వ, గంగ సాయిలు,దమ్మడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

