. . . కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు
మాచారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆదివారం మాచారెడ్డి అన్నారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి వాహనాలను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారాల కొద్ది కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని లారీలు రావడం లేదని అనేక తిప్పలు పడుతున్నామని వాటిని భరించలేక రోడ్డెక్కి ధర్నా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇలాగే ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యం వీడి సంబంధిత ఐకెపి, సోసైటీలు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
