. . . సబ్ స్టేషన్ ఆపరేటర్ నిర్భంధం
కామారెడ్డి, బతుకమ్మ :
వరిసీజన్ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఎడతెరిపి లేకుండా జరుగుతున్న పవర్ కట్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా నిరంతరంగా విద్యుత్ కోతలు కొనసాగుతుండటంతో బోరు మోటార్లు నడవక, పొలాల్లో వేసిన నారు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ ఆపరేటర్ను నిర్బంధించి నిరసన తెలిపారు. కామారెడ్డిలో ఈ ఘటన కలకలం రేపింది. దీంతో సాగు మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో రోజుకు కొన్ని గంటల మాత్రమే కరెంట్ అందుతుం డటంతో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయని రైతులు తెలిపారు. వరినాట్ల సమయంలో తగినంత విద్యుత్ ఇవ్వాలని పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో విసిగిపోయిన రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రైతులు నేరుగా విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకుని ఆపరేటర్ను లోపలే నిర్బంధించి తాళం వేశారు. సమస్యకు ఉన్నతాధికారులు వచ్చి శాశ్వత పరిష్కారం చూపే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. వరిసీజన్ సమయంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
