- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు డాక్టర్.బి. కేశవులు విజ్ఞప్తి
నిజామాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నమోదు మరో రెండు వారాల పాటు గడువును పొడిగించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్.బి. కేశవులు విజ్ఞప్తి చేశారు. మెదక్, నిజామాబాద్ , కరీంనగర్ , ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఓటర్ల నమోదుకు అనుకున్నంత స్పందన లభించడం లేదని, పట్టభద్రులు చాలామంది ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో (మొత్తం కొత్త జిల్లాలు 15, మొత్తం 271 మండలాలు) దాదాపుగా 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ అర్హులు ఉండగా ఇప్పటివరకు 2 లక్షల మంది కూడ ఎన్ రోల్ చేసుకోలేకపోయారని, ప్రత్యేక క్యాంపులను, బృందాలను ఏర్పాటు చేసి కనీసం 50 శాతం ఎన్ రోల్ చేరాలంటే గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల వైపు నుంచి ఓటరు నమోదు ప్రక్రియ గురించి మొక్కుబడిగానే అవగాహన కార్యక్రమాలు ఉంటున్నాయని, ఓటునమోదుపై ఆయావర్గాల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు జరగడం లేదని గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఉమ్మడి జిల్లాలో 1,97,000 మంది ఓటర్లు ఎన్రోల్ చేసుకోగా లక్షా 9 వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఆరు సంవత్సరాల కాలంలో 5లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకు వచ్చారని కనీసం ఇంకో 2 నుంచి 3 లక్షల మంది అభ్యర్థులైన ఎన్ రోల్ చేసుకోవాలని, అప్పుడే ఎన్నికలకు విలువ గౌరవం ఉంటుందని, తక్కువ ఎన్రోల్ శాతంతో ఎన్నికల నిర్వహించడం కూడా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని డాక్టర్ కేశవులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వాళ్ళు కూడ ఇలా నిర్లక్ష్యంగా ఎన్రోల్ చేసుకోకపోవడం కూడా బాధ్యత రాహిత్యమేనని, ఇందుకు ఎన్నికల సంఘం కూడ ప్రత్యేకంగా చర్యలు తీసుకొని, అన్ని విభాగాలతో మాట్లాడి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎన్రోల్ పెరగడానికి శాయశక్తుల కృషి చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలు కృషి చేయవలసిందిగా కలెక్టర్లకు ఆర్డర్లు ఇవ్వాలనిఇందుకు కనీసం రెండు వారాలు వ్యవధి పొడిగించవలసిందిగా డాక్టర్ కేశవులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కోరారు.