. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
. . . ఇంటింటి సర్వే ప్రారంభం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలును అనుసరిస్తూ ఎస్.ఆర్.ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీ.ఎల్.ఓ) గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బీ.ఎల్.ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసు (నివాసం)లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యుమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి, ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్ లైన్ ద్వారా బీ.ఎల్.ఓ మొబైల్ యాప్ లో అప్ డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారం కరెక్ట్ గా నింపే విధంగా చూడాలని బీ.ఎల్.ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసిల్దార్ వినయ్ సాగర్ పాల్గొన్నారు.

