నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతృ మరణాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి గర్భిణీని 12 వారాల్లోపు నమోదు చేసి, కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర లక్షణాలున్న గర్భిణీలను ప్రత్యేకంగా గుర్తించి, అవసరమైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. గర్భిణీలకు హెచ్బి, బీపీ, రక్తహీనత, హైపర్టెన్షన్ తదితర పరీక్షలు నిర్వహించి ముందస్తు ప్రణాళికతో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రమాద సూచనలు ఉన్న గర్భిణీలను నిపుణులు ఉన్న ఆసుపత్రులకు రిఫర్ చేసి సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. మాతృ మరణాలు సంభవించిన సందర్భాల్లో పూర్తి వివరాలతో వైద్య, సామాజిక స్థాయిలో ఆడిట్ నిర్వహించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎలాంటి మాతృ మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా ఉప వైద్యాధికారులు, వైద్య నిపుణులు, వివిధ పీహెచ్సీల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
