. . . జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు సమిష్టి కృషి అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. శనివారం నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ బి. రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల తొలగింపు, దోమతెరల వినియోగం, “ఫ్రైడే డ్రై డే” పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. “మనందరి పంతం – డెంగ్యూ అంతం”, “దోమలు పుట్టొద్దు – దోమలు కుట్టొద్దు” వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది నినాదం “యునిటి, యాక్ట్, ఎలిమినేట్” అని పేర్కొంటూ ప్రజలందరూ డెంగ్యూ నివారణ చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సికందర్ నాయక్, ఇతర వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
