
. జీజీహెచ్ కు అవుట్ పేషెంట్ల తాకిడి
. రక్త పరీక్షలకు గంటల తరబడి నిరీక్షణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జ్వర పీడితులతో సోమవారం కిక్కిరిసింది. విష జ్వరాలతో బాధపడుతున్న వారు ఉదయం నుంచే ప్రభుత్వ ఆస్పత్రి బాటపట్టారు. డెంగీ, చికున్ గున్యా లక్షణాలతో బాధపడుతున్న వారు రక్త పరీక్షల కోసం ల్యాబ్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. భారీ క్యూ లైన్ లో నిల్చోలేక కొందరు అక్కడే పడుకోగా, మరి కొందరు నిల్చోలేక కూర్చున్నారు. ల్యాబ్ లో తగినంత సిబ్బంది లేకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని రోగులు, వారి సహాయకులు అంటున్నారు. బ్లడ్ శాంపిళ్లు ఇచ్చిన వారికి మరుసటి రోజు రిపోర్టు ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి పరిస్థితిని చూసి భయపడి చాలా మంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించాలని, వైద్యులతోపాటు ల్యాబ్ సిబ్బందిని తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

