ప్రమోద్ కుమార్ స్మారక ఫుట్ బాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ
నిజామాబాద్ , బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ యువతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన మన సహచరుడు కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి అంకితంగా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించడం అత్యంత గర్వకారణమన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగం మనందరికీ చిరస్మరణీయమన్నారు. ఆయన సేవలు, ధైర్యసాహసాలు పోలీస్ విభాగానికి మాత్రమే కాదు సమాజానికి ఆదర్శప్రాయమన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందడమే కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకునే అవకాశం లభిస్తుందన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని పెంచిసానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు.ఈ పోటీలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడుతూ ప్రమోద్ త్యాగానికి నిజమైన నివాళి అర్పించాలని కోరారు.ఈ టోర్నమెంట్ విజయవంతం చేసి అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో మారుమూల గ్రామాలలో యువత డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్,సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదం యువతకు తెలియజేయాలన్నారు. అలాగే గత వారం లో ప్రారంభమైన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల భద్రత రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలను, ప్రమాద నివారణ సూచనలు గురించి ప్రస్తావించారు. మన తోటి పౌరుల, కుటుంబ సభ్యుల భవిష్యత్తు శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకొని తగిన ప్రభుత్వం, పోలీసు వారు సూచించిన నియమాలు జాగ్రతలు పాటించాలని సీపీ సూచించారు. జిల్లాలో 2020, 2021లో జరిగిన కోవిడ్ మరణాలకన్నా గత సంవత్సరం లో జరిగిన రోడ్డు ప్రమాద మృతులు ఎక్కువగా జరిగాయన్నారు. దయచేసి ఆందరూ గమనించాలనిరోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహన కల్పించుకొని తాము, తమ కుటుంబ సభ్యులు,తోటి స్నేహితులు, తోటి ఉద్యోగులు,విద్యార్థులు, యువత కంకణం కట్టుకోవాలన్నారు. పోలీస్ శాఖ కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా గట్టి చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేసారు. ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ ఈ నెల 18, 19 తేదీలలో ఉదయం నుండీ సాయంత్రం వరకు పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్ లో జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సహకారం తో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ టోర్నమెంట్లో 6 టీంలు పురుషులు, 6 టీంలు మహిళలకు సంబంధించినవిగా ఏర్పాటు చేశారు. గెలుపోటములు సర్వసాధారణమని, ప్రతి ఒక్కరూ క్రీడాకారులు టీం వర్క్ తో ముందుకెళితే విజయము తప్పకుండా సాధించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులు, అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసిపి శ్రీనివాస్, జిల్లా ఫుట్బాల్ ప్రెసిడెంట్ మీర్ ఫారూఖ్ అలీ, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, జిల్లా రంజీ క్రికెట్ ప్లేయర్ అంకిత్ రెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జావీద్, జాయింట్ సెక్రెటరీ మసూద్, కోచ్ నాగరాజు , టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, జిల్లా లోని ఫుట్బాల్ క్రీడాకారులు,వారి టీంలు పాల్గొన్నారు.

