. . . ఏఐటీయూసీ నూతన జిల్లా అధ్యక్షుడు వై.ఓమయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్రంలో అమలవుతున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాలను రద్దు చేసి ఉద్యోగులను శాశ్వతీకరించాలని లేదా కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నూతన జిల్లా అధ్యక్షుడు వై.ఓమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 22వ జిల్లా మహాసభ సోమవారం ఘనంగా నిర్వహించారు. మహాసభ అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు వై.ఓమయ్య సమావేశ వివరాలను వెల్లడించారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, ప్రభుత్వ కార్మిక విధానాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీలు, ఆటో కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అలాగే స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి నెలకు రూ.26 వేల కనీస వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలను అమలు చేయాలని తీర్మానించారు. జిల్లాలో స్థానిక నిరుద్యోగులకు పరిశ్రమల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు తెలంగాణ కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, బీడీ పరిశ్రమపై విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టాలని మహాసభ నిర్ణయించింది. ఈ సందర్భంగా 44 మంది సభ్యులతో కూడిన నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా వై. ఓమయ్య, ప్రధాన కార్యదర్శిగా పిన్నిల హనుమాన్లు, ఉపాధ్యక్షులుగా టి.చక్రపాణి, రాజన్న, కవిత, అంజయ్య, చందర్, సహాయ కార్యదర్శులుగా సంజీవ్, అనిల్, దేవేందర్, భాగ్యలక్ష్మి, గోవర్ధన్, సంపత్, కోశాధికారిగా ఎస్.డి.ఫెరోజ్, అదనంగా కార్యవర్గం, కౌన్సిల్ సభ్యులను కూడా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశంలో సంజీవ్, అనిల్, చందర్, గోవర్ధన్, ఫెరోజ్, రాధా కుమార్, లాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
