నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే మాదిగ విద్యార్థి యువ గర్జన వాల్ పోస్టర్ ను నుడా చైర్మన్ కేశవేణు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం.. ఎస్సీల వర్గీకరణ సాదిద్ధా.. అనే నినాదంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30ఏళ్ల మాదిగల పోరాటానికి గత సంవత్సరం ఆగస్టు 1న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తాము వర్గీకరణకు అనుకూలమని చెప్పారని అన్నారు. ఇది మాదిగల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించి ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులు రాజ్ గగన్ మాదిగ, ఆర్మూర్ ఇంచార్జీ దేవయ్య మాదిగ, గైక్వాడ్ గంగాధర్, సాయి కాంబ్లే, శంకర్ మాదిగ, హరీష్ మాదిగ, సురేష్ మాదిగ, మాదిగ మహళా విభాగం అధ్యక్షురాలు బాయికాడి లత తదితరులు పాల్గొన్నారు.
