. . . మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వెల్లడి
పిట్లం, బతుకమ్మ :
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వదులుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. శుక్రవారం పిట్లం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నిర్వహణ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. జొన్నల కొనుగొలులో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ హనుమంత్ షిండే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరముల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జొన్నలను కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. జొన్నలకు రూ.2400 మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేసి, అనంతరం జొన్నలను 1200 రూపాయలకు ప్రభుత్వం అమ్ముకొని నష్టాన్ని రైతుల సంక్షేమం రీత్యా భరించి రైతులకు కష్టం కాకుండా చూసిందని, ప్రస్తుత ప్రభుత్వం చిన్నపిల్లలకు నోట్లో చాక్లెట్ పెట్టి ఆశ చూపిన విధంగా అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం జరుగుతుందని మండిపడ్డారు. ప్రజలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఆయనన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం రైతులపై ప్రేమ ఉంటే తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జొన్నలను కొనుగోలు చేయాలని అన్నారు. తెరాస హయాంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయడం జరిగిందని, రైతుల సంక్షేమం దృశ్యా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగిందని, ప్రస్తుత ఎమ్మెల్యే నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ వాసరీ రమేష్, సీనియర్ నాయకులు అన్నారం వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు జొన్న ప్రతాపరెడ్డి, అరికెల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు రజనీకాంత్ రెడ్డి, విజయ్, మాజీ వైస్ ఎంపీపీలు లక్ష్మారెడ్డి, నర్సాగౌడ్, జొన్న శ్రీనివాస్ రెడ్డి, జంబిగా హన్మండ్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, మండలంలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.



