నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య జిల్లా అధికారులతో కలిసి మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని సీ.ఎం సభా స్థలిగా ఖరారు చేసిన నేపధ్యంలో కలెక్టర్ , సీ.పీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, వేదిక తదితర వాటి ఏర్పాట్లను నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీ.ఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు. ముందస్తుగానే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ సర్దార్ సింగ్, ట్రాన్స్కో ఎస్.ఈ రాజేశ్వర్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.

