- రేషన్ షాపును సందర్శించి సన్నబియ్యం పంపిణీపై ఆరా
- భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పరిశీలన
- ఎరువుల పంపిణీ కేంద్రం తనిఖీ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. తహశీల్ కార్యాలయంతో పాటు రేషన్ షాపు, ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. స్థానికంగా గల గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ముందుగా తహశీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 3480 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ వెంకట్ రావు తెలుపగా, దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. వచ్చిన అర్జీలను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ ఆన్లైన్ లో వెంటదివెంట అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం ఇందల్వాయి లోని 12 నెంబర్

రేషన్ దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లబ్దిదారులకు మూడు నెలలకు సంబంధించి ఒకేసారి అందించిన సన్న బియ్యం పంపిణీ పూర్తి స్థాయిలో జరిగిందా అని డీలర్ ను ప్రశ్నించారు. జూన్ నెలాఖరు నాటితోనే పంపిణీని పూర్తి చేశామని తెలుపగా, కలెక్టర్ రికార్డులలో వివరాలను పరిశీలించారు. అక్కడి నుండి కలెక్టర్ స్థానికంగా గల ఎరువుల పంపిణీ కేంద్రానికి చేరుకొని, ఎరువుల స్టాక్ ను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి, అవసరమైన ఎరువులు సక్రమంగానే అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎరువుల సరఫరా సంతృప్తికరంగా ఉందని రైతులు తెలుపగా, జిల్లాలో యూరియా సహా ఇతర అన్ని ఎరువుల నిల్వలు సరిపడా

అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ భరోసా కల్పించారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలని, ముందస్తుగానే ఎక్కువ నిలువలను సమకూర్చుకోవాలనే ఆదుర్దా వద్దని హితవు పలికారు. ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. అక్కడి నుండి కలెక్టర్ గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించారు. అవసాన దశలో ఉన్న భవనాన్ని గమనించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని డాక్టర్ గంగా ప్రసాద్ కు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

