నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సీఎం అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను పాత ఏజెన్సీలకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనం గంగాధర్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దర్శనం గంగాధర్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు తాము భోజనం వండి అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంతో పాటు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కు అప్పగించాలని యోచిస్తోందని, ఈ విధానం అమలయితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు పాల్గొన్నారు.