హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం స్వామివారికి ప్రత్యేక సేవల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు సమర్పించారు. దర్శనానంతరం సీఎం జగద్గురు శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆధ్యాత్మిక అంశాలు, రాష్ట్ర శ్రేయస్సుపై కొంతసేపు చర్చించినట్లు సమాచారం.

సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు దర్శనానికి హాజరయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి తో పాటు మంత్రి కోమటి వెంకట్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సీఎంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం పర్యటనతో యాదగిరిగుట్ట ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

