నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దివ్యాంగ ఉద్యోగ, ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 19 న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిజామాబాద్ జిల్లా అద్యక్షుడు బి.శంకర్ రాజు తెలిపారు. నగరంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి గృహంలో అధ్యక్షుని ఆద్వర్యంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ ఉద్యోగుల హక్కుల సంక్షేమానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్న నేపథ్యంలో 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగ ఉద్యోగులకు ప్రీమియం చెల్లింపులో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నామన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ ప్రకాశం హాల్ లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆర్ .కృష్ణమూర్తి జిల్లా ఇన్చార్జి కృష్ణారెడ్డి కోశాధికారి పి. బసవయ్య వివిధ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
