. సరైన సమయంలో సరైన మందులు వేసుకోవాలి
. రుమటాలజిస్ట్ పర్యవేక్షణతో పోస్ట్ వైరల్ రుమాటిజం నుంచి విముక్తి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పోస్ట్-వైరల్ రుమాటిజం (విషజ్వరాలు)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ డాక్టర్ జి.గ్రీష్మ ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యంగా వర్షకాలంలో చికున్ గున్యా, డెంగీ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని, జ్వరం తగ్గిన తర్వాత చాలా మందికి కీళ్ల నొప్పులు వస్తుండడం చూస్తున్నామని, దీన్నే పోస్ట్ వైరల్ రుమాటిజం అంటారని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరిలో ఈ సమస్యని రావొచ్చని, ముఖ్యంగా మోకాలు, చీలమండ నొప్పి, వాపులు ఉంటాయని తెలిపారు. 15 నుంచి 20శాతం మందిలో వెన్నెముఖకి వాపు రావొచ్చని (స్పాండిలో ఆర్థరైటిస్), ఇది 3 నెలల వరకు ఉండొచ్చని తెలిపారు. 10 శాతం మందిలో ఒక ఏడాది వరకు నొప్పులు ఉండొచ్చని, కొంత మందిలో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా దారితీస్తుందన్నారు. ఈ సమస్య కోసం డీఎంఏఆర్డీలు, బయోలాజికల్ అనే కొత్త మందులు వచ్చాయని, సరైన సమయంలో సరైన మందులను రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో తీసుకుంటే పోస్ట్-వైరల్ రుమాటిజం నుంచి విముక్తి పొందొచ్చని డాక్టర్ గ్రీష్మ అవగాహన కల్పించారు.
