అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రులు కొండా సురేఖ, పొన్నం సూచన
రూ.20 కోట్ల నిధులు కేటాయింపు
హైదరాబాద్,బతుకమ్మ : హైదరాబాద్ లో బోనాల పండుగకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఆషాఢ మాసం జూన్ 26 నుంచి ప్రారంభం కానుంది. బోనాల పండుగ నిర్వహణ పై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కలిసి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోనాల పండుగ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరంలో మొత్తం 28 ఆలయాల్లో బోనాలు ఘనంగా నిర్వహించాలన్నారు. జూన్ 26న గోల్కోండ కోటలో బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణలో బోనాలు పండుగ ప్రారంభవుతుందన్నారు. ఆషాఢ చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ ఆలయాల్లో సందడి ఉంటుంది. గోల్కొండ బోనాలు నిర్వహించిన వారానికి ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అనంతరం లాల్ దర్వజా, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. బోనాల సందర్భంగా రంగం, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు చేపడతారు. కాగా.. బోనాల పండుగకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రులు ఆదేశించారు.
