. ఆయన ఎంపీగా గెలవడమే మిరాకిల్
. జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి
. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లాకు ఎంపీ అర్వింద్ ఎన్ని నిధులు, ఎన్ని రైల్వే పనులు తీసుకొచ్చారో చెప్పాలని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్వింద్ ఎంపీగా గెలవడమే మిరాకిల్ అని ఎద్దేవా చేశారు. మోడీ హవాలో గెలిచిన ఆయనకు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుద్శన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. గుత్ప, అలీసాగర్, తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల వంటి ఎన్నో పనులు సుదర్శన్ రెడ్డి చేశారని గుర్తు చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. బైంసా అల్లర్లు ఇక్కడ చూపించి గత ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లు గెలిచిందని విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీ నిజాంషుగర్స్ ను నానశం చేశాయి
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని బీఆర్ఎస్, బీజేపీ నాశనం చేశాయని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ విమర్శించారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని మభ్య పెట్టారన్నారు. గతంలో తమ ప్రభుత్వం తాగు, సాగునీటి రంగాల కోసం విశేష కృషి చేసిందన్నారు. నందిపేటలో సెజ్ కోసం 400 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. అర్వింద్ ఒక్క ఇండస్ర్టీనైనా తీసుకొచ్చావా..? యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా..? అని ప్రశ్నించారు. అహంకారపూరిత వ్యాఖ్యలు సరికావని ఆయన హితవు పలికారు. నియోజకవర్గానికి ఒక్క నాలుగు లేన్ల రోడ్డునైనా తీసుకొచ్చావా అని అన్నారు. అర్వింద్ మాటలు ఆడవాల్లు నీటి కోసం గొడవపడినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.