. . . ఆశా వర్కర్ లకు పని భారం తగ్గించాలి
. . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అంగన్ వాడీలకు గత రెండు నెలల జీతాలు ఇంతవరకు అందలేదని, వెంటనే ఏప్రిల్, మే నెల వేతనాలను చెల్లించాలని, ఆశా వర్కర్ లకు పని భారం తగ్గించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్ వాడీలకు గత రెండు నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో పేద, మధ్య తరగతి కి చెందిన అంగన్ వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో అంగన్ వాడీలు సమ్మె నిర్వహించినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం హామిలు ఇచ్చిందని, ఆ హామిల మేరకు కనీస వేతనం రూ.18000 అందజేయాలన్నారు.

పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా దాన్ని అమలు చేయకపోగా రోజు రోజుకి పని భారం పెంచుతున్నారన్నారు. ఫీల్డ్ వర్క్ చేయాల్సిన ఆశా వర్కర్ లను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సబ్ సెంటలర్ లలో విధులు నిర్వహించేలా ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల ఆశా వర్కర్ లె మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆశా వర్కర్ లకు కనీస వేతనం అమలు చేయాలని, అర్హులైన వారికి ఏఎన్ఎంలుగా ప్రమోషన్ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే కాలంలో రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, నాయకులు అనిత, శివ నంద, ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి సుకన్య, జిల్లా నాయకులు రేణుక, నర్సా తదితరులు పాల్గొన్నారు.

