నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డా.బి రాజశ్రీ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో గల మున్సిపల్ కార్మికులందరికీ శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు శారీరక పరిశుభ్రత పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలని, ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి జీవనశైలి వ్యాధులను ముందే గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదే విధంగా క్షయ వ్యాధికి గురి కాకుండా చక్కని పోషకాహారం తీసుకోవాలని తెలియజేశారు. మున్సిపల్ కార్మికులందరికీ ఎక్స్ రేల ద్వారా క్షయ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, లక్ష్మణ్, నరేష్, శ్యామల, క్షయ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

