కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి కలెక్టరేట్ లోని సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 9: 30 గంటలకు కలెక్టరేట్ కి చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల్లాగా వచ్చి కలెక్టరేట్ మొత్తం తిరిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం గంట తర్వాత సివిల్ సప్లయ్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లను తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం. కార్యాలయ సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వహిస్తారనే వివరాలు తీసుకుని కార్యాలయంలోని రికార్డుల తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆకస్మికంగా ఏసీబీ సోదాలు జరగడం కలకలం రేపింది. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేపడుతున్నారా.. లేక ఎవరైనా ఫిర్యాదు చేశారా… అనేది చర్చనీయాంశంగా మారింది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
