. . . బాలికల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది..
. . . నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశ అభివృద్ధికి పునాది బాలికలని, బాలికల చదువు కోసం వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్, సీనియర్ సిటిజన్ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై దాడులు లేని సమాజాన్ని సాధించుకుందామని.. వారికి ఉన్న హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను సంరక్షించుకుందాం, వారికి మంచి జీవితాలను ఇద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ, విద్యకు పెద్దపీట వేస్తుందని, అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పీఎం పోషణ్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, పదోతరగతి తర్వాత చదువు కొనసాగించేందుకు జాతీయ బాలికల విద్య ప్రోత్సాహక పథకం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక తరానికే మార్గ నిర్దేశకులు అవుతారని ఆయన అన్నారు. దయచేసి బాలికల తల్లిదండ్రులు వారి చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రతి ఒక్కరు అభివృద్ధి పథానా నడుస్తారని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పద్మ లత, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, సిడిపిఓలు సౌందర్య, పద్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
