నిజామాబాద్, బతుమకమ్మ : రవాణా రంగంలో వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు (సీఐటీయూ) కటారి రాములు డిమాండ్ చేశారు. నగరంలోని కాకతీయ అడ్డా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ పోస్టర్ ను శనివారం ఆయన, ఆటో డ్రైవర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధo) ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఈనెల 24న చలో పార్లమెంట్ దేశవ్యాప్త కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆటో స్టాండ్ అడ్డా కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పండరి విఠల్, అబ్దుల్, అమిత్, ఇమ్రాన్, ఎండీ అస్లాం, ఎండీ అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.