. . . నిర్లక్ష్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ సంబంధిత శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
. . . రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన గ్రామస్తులు
. . . రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన కత్తి గంగారాం
రుద్రూర్, బతుకమ్మ :
రోడ్డెక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరతామా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏ వైపు నుంచి మృత్యువు వెంబడిస్తుందో తెలియని దుస్థితి. కారణం రహదారుల అస్తవ్యస్త నిర్మాణం. పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలు దీనికి తోడు రోడ్డు నిర్మాణ సంస్థ సరైన నిబంధనలు పాటించక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ఫుడ్ సైన్స్ కళాశాల ముందు ఫిబ్రవరి 28న రాత్రి సమయంలో రోడ్డు పై పోసిన మొరం కుప్ప పై పడి కత్తి గంగారాం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఏలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నడి రోడ్డుపై మొరం కుప్పలు వేయడంతో అదే రోజు సుమారు 8 మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. స్వల్ప గాయాలతో కొంతమంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ 5రోజులు మృత్యువుతో పోరాడిన కత్తి గంగారాం శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రభుత్వం ప్రజా సౌకర్యార్థం రోడ్డు నిర్మాణాలు చేపడుతుంటే నిర్మాణ సంస్థ సరైన నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతుంది. ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొంతమంది ప్రమాదాల బారిన పడి జీవితాలు హస్తవ్యస్తం అవుతున్నాయి. ఇంత జరుగుతున్న నిర్మాణ సంస్థ ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది. నిర్లక్ష్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థపై సంబంధిత శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదే రోజు రాత్రి ఘటన స్థలంలో అక్బర్ నగర్ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతి చెందిన కత్తి గంగారం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

