. . . శనివారం అట్టహాసంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
. . . క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పాలనాధికారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పేద కుటుంబాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఈ నెల 15న (శనివారం) మద్యాహ్నం రెండు గంటలకు లబ్దిదారులకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు.

జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రేషన్ కార్డులు కలిగి ఉన్న లబ్దిదారులు, రేషన్ డీలర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపధ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ వసతి ఉండాలని, వేదిక, సీటింగ్ అరేంజ్ మెంట్, సౌండ్ సిస్టం, ఎల్.ఈ.డీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లను పక్కాగా సరిచూసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఓ సాయన్న, సివిల్ సప్లైస్ డీ.ఎం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

