కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, మర్కల్కు చెందిన విద్యార్థిని ఎం. అమృత జావెలిన్ త్రోలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించింది. హనుమకొండలోని జె.ఎన్. స్టేడియంలో ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించిన 12వ తెలంగాణ యూత్ (అండర్-18) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో అమృత 23.48 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రశంసా పత్రాన్ని అందజేసింది. అమృత సాధించిన విజయంపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి అభినందనలు తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు అమృతను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విద్యార్థులు రాణించేందుకు కళాశాల తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.

