. . . యోగా శిక్షకుడు మిద్దె అజయ్
తాడ్వాయి, బతుకమ్మ :
యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని యోగా శిక్షకుడు మిద్దె అజయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు విద్యార్థులకు యోగా శిక్షణ, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థి, యోగా శిక్షకుడు మిద్దె అజయ్ కుమార్ దాదాపు రెండు గంటల పాటు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజూ కొంత సమయం యోగా కోసం కేటాయించాలని సూచించారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ధైర్యం, ఏకాగ్రత పెరుగుతాయని వివరించారు. అనంతరం అధ్యాపకులు వీరేశం, సతీష్ మాట్లాడుతూ యోగా ప్రాధాన్యతను వివరించారు. విద్యతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కళాశాల అధ్యాపకులు కృషి చేస్తున్నారని, విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లేశం, శ్రీకాంత్, అలంపల్లి శ్రీనివాస్, సరస్వతి, మనీషా, హారికతో పాటు సిబ్బంది నరసయ్య, సోటేరియా పాల్గొన్నారు.

