. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
లింగంపేట్, బతుకమ్మ :
పోలీస్ సిబ్బంది జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సిబ్బందికి సూచించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతిని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ స్టేషన్ సిబ్బందితో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. నేర పరిశోధనలో పోలీసులకు ఉండే ప్రాథమిక దర్యాప్తు విధానాలు, నేర పరిశోధనలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులపై సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగి వారి నైపుణ్యాలను పరీక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, చట్ట పరిధిలోనే ఖచ్చితంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి స్టేషన్ ఎస్ఐ నరేష్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
