నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే 25 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఉల్లాస్ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లు, అభ్యాసకులను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ సాయన్న, డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ ఏ. పురుషోత్తం, అదనపు డీఆర్డీఓ మధుసూదన్, ఏపీఓ అడల్ట్ ఎడ్యుకేషన్ అరుంధతి, డీపీఎంలు వెంకటేష్, నీలిమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యా చైతన్యాన్ని పెంపొందించడంలో వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. అభ్యాసకులు విద్యను అలవరచుకుని వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లు, అభ్యాసకులకు స్మారక చిహ్నాలు అందజేసి ఘనంగా సన్మానించారు. విద్య ద్వారా వ్యక్తిగత పురోగతితో పాటు సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు, అభ్యాసకులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

