నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే నెలలో పదవీ విరమణ పొందిన ఆరుగురు సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ పొందిన సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, శుభాకాంక్షల సర్టిఫికెట్లు అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఆఫీస్ సూపరింటెండెంట్ అహమ్మద్ అబ్దుల్ బషీర్ 41 సంవత్సరాల సేవను పూర్తి చేసి పదవీ విరమణ పొందగా, సీసీఆర్బీ ఎస్సై బాదావత్ శివరాం 37 సంవత్సరాలు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై గైక్వాడ్ అప్పారావు 42 సంవత్సరాలు, మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై సేరుపల్లె మొగులయ్య 37 సంవత్సరాలు, సీఎస్బీ ఏఎస్సై మువ్వ లింగారావు 36 సంవత్సరాలు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మస్కే జీవన్ 33 సంవత్సరాల సేవను పూర్తి చేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో తీవ్రమైన పనిభారాన్ని ఎదుర్కొంటూ ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా సేవలందించి పదవీ విరమణ చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, అయితే ఉద్యోగ కాలంలో చేసిన సేవలే వారికి గుర్తింపును తీసుకువస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది పోలీస్ శాఖకు అందించిన సేవలు అమూల్యమని కొనియాడారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరం వచ్చినా శాఖ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వారు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, హోంగార్డ్స్ ఏసీపీ కె.దీపక్ చంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ.జగతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, ఎంటీఓ ఎస్.శేఖర్ బాబు, వెల్ఫేర్/హోంగార్డ్స్ ఇన్చార్జ్ సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షాకిల్ పాషా, పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
