. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
సారంగాపూర్, బతుకమ్మ :
నకిలీ పట్టాలతో స్మశాన వాటిక కాజేయటానికి ప్రయత్నిస్తున్నారని వారి నుండి స్మశాన వాటికను కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సారంగపూర్ ప్రజల స్మశాన వాటిక స్థలాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేనెంబర్ 285, 286, 287 లో ఉన్న స్థలాన్ని గత 60 సంవత్సరాల పైగా ఆ గ్రామంలోని వివిధ కులాలకు చెందిన ప్రజలు మరణించిన వారి సమాధులు చేశారని, అంత్యక్రియలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ భూమి పట్టాదారు ప్రజల అవసరార్థం దాన్ని వదిలినప్పటికీ ఇటీవల ఆ భూమి యొక్క విలువ పెరగటంతో, సమాధులను సైతం లెక్కచేయకుండా కొద్దిమంది దళారులు అధికార పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని అక్రమ పట్టాలు చేసుకుని స్మశాన వాటిక స్థలం తమదని దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించటం సరైనది కాదని, గ్రామ ప్రజల అవసరం రీత్యా ఉన్నటువంటి భూమిని అనేక దశాబ్దాలుగా ప్రజలు ఉపయోగించుకుంటున్నప్పటికీ గతంలో ఎప్పుడూ అడ్డుపడని వ్యక్తులు ఇటీవల అడ్డుపడుతున్నారని అన్నారు. స్మశాన వాటికను అధికారులు కాపాడాలని లేకుంటే గ్రామ ప్రజల చేత ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా వాటి మీద అక్రమార్కులు స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని వీటిని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు నల్వాల నరసయ్య, అంజయ్య, రాజు, సతీష్, సారంగాపూర్ వాస్తవ్యులు శ్రీనివాస్ గౌడ్, సూరి, ఉస్కే అంజయ్య, శ్రీనివాస్, పల్లపు యాదేశ్, తదితరులు పాల్గొన్నారు.

