. . . టిటిడి తరహాలో యాదగిరి గుట్టని అభివృద్ధి చేయాలి
. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
యాదగిరిగుట్టలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ అభివృద్ధిలో భాగంగా మొత్తం ₹99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ₹43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల విధానంలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్య అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించేందుకు ప్రత్యేక శాలలు, అలాగే గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు.

వేద పాఠశాలకు భూమిపూజతో పాటు ₹43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం ₹9.87 కోట్లతో భారీ కల్యాణ మండప నిర్మాణానికి, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ₹1.41 కోట్ల వ్యయంతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణానికి, అలాగే రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా ₹1.35 కోట్లతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

