కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న సివిల్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ల (ఏఎస్సైలు) బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, పూర్తిగా పారదర్శక పద్ధతిలో నిర్వహించారు. ఈ బదిలీల ప్రక్రియ ద్వారా మొత్తం 146 మందిని బదిలీ చేయడం జరిగిందని, వారిలో 8 మంది ఏఎస్సైలు, 18 హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, పోలీస్ విభాగంలోని ఎంటీ సెక్షన్ కి సంబందించిన 9 మంది సిబ్బందికి స్థానచలనం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పారదర్శక బదిలీలు బాధ్యతాయుత విధులకు పునాది అని, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్సైలు తమ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీస్ అధికారిగా నైతికత, నిబద్ధత అనేవి కీలకంగా ఉండాలని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు విదుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ మధుసూదన్, ఆర్బలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

