నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా అటవీ అధికారిగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నిజామాబాద్ డీఎఫ్ వో కార్యాలయంలో ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో అటవీ సంరక్షణ, వన్యప్రాణులను కాపాడడమే మొదటి ప్రాధాన్యత అన్నారు.

రిజర్వు అటవి ప్రాంతాన్ని ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణ చేస్తానని, అక్రమంగా వనాలను నరికివేతకు అడ్డుకట్ట వేయడం, క్షేత్రస్థాయిలో నిఘాను పెంచుతామన్నారు. వన్యప్రాణులు అటవీ శివారు ప్రాంతాల్లో సంచారం వల్ల ప్రజలు ఆందోళన చెందొద్దని అక్కడ భద్రత చర్యలు చేపడుతామని అన్నారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాల నివారణకు సిద్దంగా ఉన్నామని, స్థానికుల మద్దతుతో అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక వ్యూహంతో పని చేస్తామన్నారు. నిజామాబాద్ పర్యావరణ పర్యాటక అభివృద్ది కోసం మల్లారం రిజర్వు అటవీ ప్రాంతంతో పాటు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అటవీశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ను డివిజనల్ అధికారులు, రేంజ్ అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.

