. . . జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష లో డీఎంహెచ్ఓ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఉపకేంద్రస్థాయిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రస్థాయిలో ఆరోగ్య సేవలను, రిపోర్టులను, రికార్డుల జాబితాను లక్ష్యాలకు అనుగుణంగా సవరిస్తూ అధికారులందరూ పర్యవేక్షించాలని జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారి డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని జిల్లా ఉప వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై తన ఛాంబర్ లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అధికారులందరూ సమయపాలన పాటిస్తూ, కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలన్నింటికి ప్రోగ్రాం అధికారులు, జిల్లా వైద్యాధికారులు హాజరు కావాలన్నారు. డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు ఆరోగ్య ఉప కేంద్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. హెచ్ పి వి వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించని మాలపల్లి, సాలూర, పెగడపల్లి, రాకాసిపేట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అర్హులైన బాలికల తల్లిదండ్రులకు అవగాహన కలిగించి హెచ్పీవీ టీకాలను ఇవ్వాలన్నారు. జిల్లాలో మీజిల్స్ రూబెల్లా కేసులు నూతనంగా 13 వచ్చాయని, అక్కడ సర్వే నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. కిశోర బాలికలకు జూన్ 10 వరకు స్నేహ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారి సహాయంతో చేపట్టే వేసవికాల శిబిరాల్లో భాగంగా ఆరోగ్య అవగాహన, చికిత్స కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జీవన శైలి వ్యాధుల పరీక్షలను ఒక కేంద్రాల వారీగా పూర్తిచేసే లైన్ లిస్టు తయారు చేయాలన్నారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శాశ్వత లక్ష్యాలను ఆరోగ్య ఉప కేంద్రాల వారిగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా నిర్ణయించి ఇవ్వాలని తెలియజేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. లక్ష్యాలు చేయని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

