ధర్పల్లి, బతుకమ్మ :
నిప్పంటించుకుని కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ధర్పల్లి మండలం గోవింద్ పల్లికి చెందిన కీర్తన తన ఏడాది కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడా భీమ్ గల్ కు చెందిన లావణ్య తన పెద్ద కూతురు కీర్తనను గోవింద్ పల్లికి చెందిన ప్రదీప్ కు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే కీర్తనకు పుట్టిన రెండో కూతురు సాన్వి కి గ్రహణం మొర్రి ఉంది. అప్పటి నుంచి కీర్తన తనలో తాను మదనపడుతూ ఉండేది. పాప అలా పుట్టడానికి తానే కారణమని తాను ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో లోపలి నుండి గడియ వేసుకుని పెట్రోల్ పోసుకుని నిప్పింటించుకుంది. దీంతో మంటలు పాపకు కూడా అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు వెంటనే డోర్లు పగులగొట్టి ఇద్దరిని ఆసుప్రతికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు తెలిపారు. కీర్తన తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
