బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో నూతనంగా మంజూరైన మీసేవా కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. స్థానికంగా ఉన్న అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రం నిర్వహణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ అంతకంటే పై చదువులు పూర్తి చేసి ఉండాలని, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని, మండలం పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని, మీసేవా కేంద్రం నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగల సామర్థ్యం అభ్యర్థికి ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను ఈనెల 13వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బాన్సువాడ తహశీల్దార్ కార్యాలయం లో స్వీకరించనున్నట్లు తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
