
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని ధర్పల్లిలో జన్మించిన రాజేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం గ్రామంలోనే పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటర్, ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీపూర్తి చేసి మహారాష్ర్టలోని నాందెడ్ లా కళాశాల నుంచి 1986లో పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాది గా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లాకోర్టు లో న్యాయవాది గా ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంలో ఆయన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహించారు. విద్యార్థి దశలో, న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ లో ఉమ్మడి జిల్లాలో ఉన్నత పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన.. కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలకు న్యాయసంబంధిత వ్యవహారాల్లో పూర్తి సహకారం అందించారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. గురువారం జిల్లాకోర్టు ప్రాంగణంలో ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి.. రాజేశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పటించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేశ్, నీలకంఠ రావు, ఎర్రం గణపతి, గడుగు గంగాధర్ , రాజ్ కుమార్ సేబేదార్, శ్రీహరి ఆచార్య, మంచికట్ల గోవర్ధన్, కిరణ్ కుమార్ గౌడ్, నల్లవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఆశా నారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
