
నిజామాబాద్, బతుకమ్మ: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసుల్లో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్డీవోలను ఆదేశించారు. గురువారం నిర్వహించిన హిట్ అండ్ రన్ కేసుల జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 32 హిట్ అండ్ రన్ కేసులు నమోదవగా, వాటిలో 27 ప్రమాదలకు సంబంధించి బాధిత కుటుంబాలను గుర్తించామని, ఇందులో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 17, ఆర్మూర్ డివిజన్ లో 7, బోధన్ డివిజన్ లో 3 కేసులు ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. బాధితులకు పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాలని ఆర్డీవోలకు కలెక్టర్ సూచించారు. విచారణ నివేదిక రూపకల్పనకు అవసరమైన వివరాలను ఆర్డీవోలకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాప్యానికి తావులేకుండా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, అదే సమయంలో అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలన చేయాలని సూచించారు. సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
