. . . ఏఎన్ఎం కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ రూమ్, తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో డ్యూటీ డాక్టర్ రక్షిత అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రౌండ్ ది క్లాక్ పీ.హెచ్.సీలో వైద్యులు లేకపోతే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. రిజిస్టర్ లు సక్రమంగా నిర్వహించకుండా, సరైన వివరాలు అందించని ఏఎన్ఎం పద్మలత తీరును తప్పుబడుతూ, షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎంహెచ్ఓ ను ఆదేశించారు. పేషంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్ పరిశీలించి, వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీలో నిలువ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.

