. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
. . . ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలో ని కచ్చియాన్ మసీద్లో మజీద్ కమిటీ అధ్యక్షుడు యాసిన్ బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మేహిమాన్ హజ్జి నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి నిజామాబాద్ డివిజన్ ఇంచార్జి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సి.ఐ ప్రసాద్, వన్ టౌన్ ఎస్. హెచ్ ఓ రఘుపతి, కచ్చియాన్ మస్జిద్ ప్రెసిడెంట్ యాసీన్ భాయ్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ బాయ్, సెక్రెటరీ ఇస్మాయిల్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

